బాహు బలంన్యూస్ కరీంనగర్, :
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు సైనిక సమ్మాన్ తరహాలో పెన్షన్ ప్రకటించి గౌరవించాలని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన ఉద్యమ ముఖ్య నాయకుల అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు.
అత్యవసర సమావేశంలో ప్రసంగం
1969 నుంచి 2013 వరకు జరిగిన 45 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అహర్నిశలు శ్రమించి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఉద్యమకారులను సముచితంగా గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లాఠీ దెబ్బలు తిని, చీకటి జైలు జీవితం గడిపిన ఉద్యమకారుల బతుకులు తీవ్రంగా చిన్నభిన్నమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ముందు ముఖ్య డిమాండ్లు..
రూ. 12 వేల పెన్షన్, ఉచిత ప్రయాణం: తక్షణమే ఉద్యమకారులను గుర్తించి నెలకు రూ. 12,000 పెన్షన్ అందించాలి. రైలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలి.
ఉద్యోగం, ఇల్లు, వైద్యం..ఉద్యమకారుల కుటుంబాలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలి. కుటుంబంలో ఒకరికి వయోపరిమితి లేకుండా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. 200 గజాల స్థలంలో ప్రభుత్వమే నేరుగా ఇల్లు నిర్మించి ఇవ్వాలి.
నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం: ప్రభుత్వ రంగ సంస్థల్లోని నామినేటెడ్ పదవుల్లో క్రియాశీలక ఉద్యమకారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.
కరీంనగర్లో ఆగస్టు 15 వేడుకలు..
ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 15న కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యమకారులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఉద్యమ ముఖ్య నాయకులు కొత్తకొండ రవీందర్రావు, శ్రీపాద సత్యనారాయణ, దేవుళ్ళపల్లి రామ్మూర్తి, బోయినపల్లి శ్రీనివాసరావు, పెంచాల రంగయ్య, జన్ను జయరాజ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.











