బాహు బలంన్యూస్,కరీంనగర్, సెప్టెంబర్ 16 : ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గి పాలకులు చరిత్రను విస్మరించడం తగదని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హితవు పలికారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే సెప్టెంబరు 17ను తెలంగాణ విముక్తి దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు. బుధవారం కరీంనగర్లో నిర్వహించిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనపై తెలంగాణ ప్రజలు సాగించిన వీరోచిత పోరాటాన్ని గుర్తుచేశారు.
గ్రామాలపై పడి ఆస్తులను దోచుకుంటూ, మహిళలను చిత్రహింసలకు గురిచేసిన రజాకార్ల దురాగతాలను ఆడబిడ్డలు రోకలిబండలు, కారపు ముద్దలతో ధైర్యంగా ఎదిరించారని కొనియాడారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన దేశభక్తులను రజాకార్లు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన చరిత్ర ఈ గడ్డకు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ చొరవతోనే సెప్టెంబరు 17న తెలంగాణ ప్రాంతానికి నిజాం పీడ విరగడై స్వేచ్ఛా వాయువులు వీచాయన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఓటు బ్యాంకు, మత రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా సెప్టెంబరు 17ను అధికారికంగా విముక్తి దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, వేముల సుదర్శన్రెడ్డి, ఎర్రబెల్లి సంపత్రావు, నల్లా వెంకట్రెడ్డి, కొత్తకొండ రవీందర్రావు, తీగల లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు.











