బాహు బలంన్యూస్ హనుమకొండ, సెప్టెంబర్ 18 :
కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్)లో ఇంజినీరింగ్ పూర్తిచేసి దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు కళాశాలకు గర్వకారణమని రాజ్యసభ మాజీ సభ్యులు, కిట్స్ సంస్థల పాలకమండలి సభ్యుడు కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. హనుమకొండలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో 1982-86 విద్యా సంవత్సరానికి చెందిన 3వ బ్యాచ్ పూర్వ ఇంజినీరింగ్ విద్యార్థుల ‘రూబీ రీయూనియన్’ (40 ఏళ్ల వార్షికోత్సవం) వేడుకలను శుక్రవారం క్యాంపస్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ… 1982-86 బ్యాచ్కు చెందిన 120 మంది ఇంజినీర్లు దేశ విదేశాల్లో ప్రముఖ ఇంజినీరింగ్ నిపుణులుగా, గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగి సంస్థ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారని ప్రశంసించారు.
కళాశాల పూర్వ సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి, ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ… తమ ఇంజినీరింగ్ విద్యాభ్యాసం పూర్తయి 40 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ వేదికపై నాటి మిత్రులందరినీ కలుసుకోవడం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. తమ ఉన్నతికి బాటలు వేసిన కిట్స్ విద్యాసంస్థను ఎప్పటికీ మరువలేమని చెప్పారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ ఛైర్మన్ వి.రాంగోపాల్రావు మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సమాజ హితానికి ఇంజినీర్లు తోడ్పడాలని సూచించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు నాటి విద్యార్థి జీవిత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.
ఈ వేడుకల్లో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ గంధం వెంకటయ్య నాయుడు, విశ్రాంత చీఫ్ ఇంజినీర్ వెంకటకృష్ణ, గెస్ట్ ఆఫ్ హానర్గా విచ్చేసిన శ్రీధర్రెడ్డి, పి.నారాయణరెడ్డి, కిట్స్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అశోక్రెడ్డి, రిజిస్ట్రార్ కోమటిరెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు, అమెరికాలో స్థిరపడిన ప్రముఖ పారిశ్రామికవేత్త నాయుడు, రామకృష్ణలతో పాటు దాదాపు 120 మంది పూర్వ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












