బాహు బలంన్యూస్,హుజురాబాద్, జూన్ 28 :
దేశవ్యాప్తంగా చేపట్టిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కల మందు పంపిణీ చేశారు. రాంపూర్ గ్రామ సర్పంచ్ ముషం సంగీత, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది.
ఆరోగ్యమే మహాభాగ్యం
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే నినాదంతో, దేశ భావి భారత పౌరులుగా ఎదిగే చిన్నారులకు భవిష్యత్తులో పోలియో మహమ్మారి వల్ల అంగవైకల్యం కలగకుండా నివారించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. గ్రామంలోని జీరో నుండి ఐదు సంవత్సరాల లోపు పసి పిల్లలందరికీ సర్పంచ్ ముషం సంగీత, ఉప సర్పంచ్ వన్నాల శివాజీలు తమ చేతుల మీదుగా పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎన్ఎం జి. రాజశ్రీ, ఆశా వర్కర్లు ఆర్. పుష్పారాణి, ఎం. విజయలక్ష్మి, సిహెచ్. భాగ్యలక్ష్మిలు పాల్గొని సేవలు అందించారు.
రెండు చుక్కల మందు.. జీవితానికి శ్రీరామరక్ష
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు బలమైన రక్షణ కవచాన్ని అందించాలని కోరారు. “ఈ రెండు చుక్కల మందు, మీ పిల్లల జీవితానికి శ్రీరామరక్ష” అని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే సమీపంలోని పోలియో కేంద్రానికి వెళ్లి తమ పిల్లలకు చుక్కల మందు వేయించాలని వన్నాల శివాజీ పిలుపునిచ్చారు.












