బాహు బలంన్యూస్,హుజూరాబాద్, జూన్ 27:
హుజూరాబాద్ పట్టణంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల సవరణ (SiR) ప్రక్రియ శనివారం అత్యంత పారదర్శకంగా, ముమ్మరంగా సాగింది. పట్టణంలోని 25వ వార్డు, 48వ పోలింగ్ బూత్ పరిధిలో బూత్ స్థాయి అధికారి (BLO) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ కమిషనర్ బైరి కిషన్, మేనేజర్ భూపాల్ రెడ్డిలు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటర్ల జాబితా నమోదు, సవరణల సరళిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టిందని, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు. జాబితాలో తప్పుల సవరణ, పేర్ల తొలగింపు, చిరునామా మార్పుల వంటి వాటిని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 25వ వార్డు విద్యానగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం రాఘవేంద్ర పాల్గొని అధికారుల విధుల నిర్వహణను పరిశీలించారు. స్థానిక ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు











