బాహు బలంన్యూస్ హుజూరాబాద్,:
పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా అహరహం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో వెలకట్టలేనివని హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని కొనియాడారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో విశ్రాంత ఉద్యోగి ప్రతాప సుధాకర్ – సరోజ దంపతుల పదవీ విరమణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో భాగస్వాములవుతున్న పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి, వారి కోసం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ… సమాజానికి అనునిత్యం ఉపయోగపడే మున్సిపల్ కార్మికుల శ్రమను గు గుర్తించి, వారిని సన్మానించాలనే ఆలోచన రావడం ప్రతాప సుధాకర్ – సరోజ దంపతుల ఉదారతకు, సద్భావనకూ నిదర్శనమని ప్రశంసించారు. శ్రమ విలువను గుర్తించి, కార్మికుల పట్ల గౌరవాన్ని చాటుకున్న ఆ దంపతుల ఆలోచన ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమైనదని, వారి సేవలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, కౌన్సిలర్లు సొల్లు సునీత, తాళ్లపల్లి రమేష్ గౌడ్, ప్రతాప మంజుల, ప్రతాప తార, కో-ఆప్షన్ సభ్యురాలు ఆలేటి సుశీల, నాయకులు ప్రతాప తిరుమల్ రెడ్డి, ప్రతాప కృష్ణ, యు. రాజయ్యలతో పాటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











