హైదరాబాద్ బాహు బలంన్యూస్ ఆగస్టు 11: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవించాలని, రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వారికి ‘సైనిక సమ్మాన్’ తరహా పెన్షన్ ప్రకటించాలని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు గట్టిగా డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని ఆయన కోరారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ఉద్యమ ముఖ్య నాయకుల సమావేశంలో పోలాడి రామారావు ముఖ్య ప్రసంగం చేశారు.
45 ఏళ్ల సుదీర్ఘ పోరాటం – చిన్నభిన్నమైన బతుకులు
1969 నుంచి 2013 వరకు దాదాపు 45 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ పోరాటంలో వేలాదిమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని పోలాడి రామారావు గుర్తుచేశారు. లాఠీ దెబ్బలు తిని, చీకటి జైలు జీవితాలను అనుభవించడం వల్ల ఉద్యమకారుల బతుకులు తీవ్రంగా దెబ్బతిని చిన్నభిన్నమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణ త్యాగాలు చేసిన పోరాట యోధులను తక్షణమే గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఉద్యమకారులకు నెలకు ₹25 వేల పెన్షన్
క్రియాశీలకంగా పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి, నెలకు ₹25,000 పెన్షన్ మంజూరు చేయాలని పోలాడి రామారావు విజ్ఞప్తి చేశారు. దాంతో పాటు ఉద్యమకారుల కుటుంబాలకు ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని, ఉచిత విద్యతో పాటు మెరుగైన కార్పొరేట్ వైద్య సౌకర్యాలు అందించాలని కోరారు.
ఇంటి స్థలం, ఉద్యోగం, నామినేటెడ్ పదవులు
వయోపరిమితితో నిమిత్తం లేకుండా ప్రతి ఉద్యమకారుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల నివాస స్థలాన్ని కేటాయించి, ప్రభుత్వమే స్వయంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని పోలాడి రామారావు స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లోని నామినేటెడ్ పదవుల్లోనూ ఉద్యమకారులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ఉద్యమ నాయకులు దేవుళ్లపల్లి రామ్మూర్తి, జనగామ కరుణాకర్ రావు, కనుకం శంకర్, శ్రీపాద సత్యనారాయణ, చింతిరెడ్డి రమణారెడ్డి, కొమ్మిడి నిరంజన్ రెడ్డి, చకిలం రమణయ్య, కొనిశెట్టి మునీందర్, పొలాడి శ్రీరంగారావు, రత్నాకర్ శర్మ తదితర వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.











