హుజూరాబాద్, ఆగస్టు 11(బాహుబలం న్యూస్): హుజూరాబాద్ పట్టణ పరిధిలోని గణేష్ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు తక్షణమే అందజేయాలని మండల ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ డిమాండ్ చేశారు. కమలాపూర్ మండలంలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ మంత్రుల ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇళ్లు పంపిణీ చేసినట్లే, హుజూరాబాద్లోనూ పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గణేష్ నగర్లో ఇళ్ల నిర్మాణం పూర్తయినా పంపిణీలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో అద్దె ఇళ్లలో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి వెంటనే ఇళ్లను కేటాయించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే బాధితుల తరఫున క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.
కమలాపూర్ మండలంలో ఈ నెల 10న జరిగిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అధికార పార్టీ మంత్రులు పాల్గొన్నారని శివాజీ గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం కాలయాపన మానాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపసర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










