బాహు బలంన్యూస్ హుజూరాబాద్, మార్చి 29:
హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధి ప్రక్కనగల గ్రామ శివారు సిర్సపల్లి గ్రామ శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ (వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం ఉప్పెనలా మారుతోంది. జనావాసాల మధ్య, నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ గత వారం రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు ఆదివారం నాటికి ఏడవ రోజుకు చేరుకున్నాయి. స్థానిక 12వ వార్డు కౌన్సిలర్, సామాజిక పోరాట యోధుడు వర్ధినేని రవీందర్ రావు ఏడవ రోజు దీక్షలో కూర్చున్నారు.ఈ నిరసన దీక్షకు మద్దతుగా హుజూరాబాద్ ప్రాంత ప్రజలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున కదిలివచ్చారు.
నియంతృత్వ ధోరణి వీడాలి: పోలాడి రామారావు.
దీక్షా శిబిరాన్ని సందర్శించిన రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పణంగా పెట్టి, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే దొడ్డిదారిన టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం పాలకుల నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. “ఇది ప్రజా ప్రభుత్వమా లేక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ప్రభుత్వమా?” అని వారు సూటిగా ప్రశ్నించారు.
వినాశకర ప్రభావంపై ఆందోళన.
ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో సంభవించే విపత్తులను నాయకులు ఈ సందర్భంగా ఎండగట్టారు.ఈ ప్లాంట్ నుంచి వెలువడే విషపూరిత ద్రవాలు భూగర్భ జలాల్లోకి ఇంకితే, ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు శాశ్వతంగా బంజరు భూములుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
గాలిలో కలిసే కాలుష్య కారకాల వల్ల గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమస్యలు తలెత్తుతాయని, పసిబిడ్డలకు తల్లి పాలు సైతం విషతుల్యమయ్యే దుస్థితి వస్తుందని హెచ్చరించారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలి, హుజూరాబాద్ ప్రాంతం మనుషులు నివసించలేని ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కాలుష్యం వల్ల పాడి పశువులకు, మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లి, గొర్రెల కాపరులు, మత్స్యకారులు తమ జీవనోపాధిని కోల్పోతారని తెలిపారు.
ప్రభుత్వం కేవలం విద్యుత్ ఉత్పత్తి పేరుతో మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని, తక్షణమే ఈ ప్రాజెక్టును జనావాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నిరసన దీక్షలు కేవలం హుజూరాబాద్కే పరిమితం కాకుండా, ఉమ్మడి నాలుగు జిల్లాల వ్యాప్తంగా మహోద్యమ రూపం దాలుస్తుందని హెచ్చరించారు. అధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, పనులను నిలిపివేయాలని అల్టిమేటం జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్,నాగార్జున డైరీ చైర్మన్ ప్రభాకర్ రావు, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, కౌన్సిలర్ సింధూజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కిషన్ రావు, సర్పంచ్ పోల్సాని రామారావు, జయన్న పౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, సుధాకర్ రావు, పాత్రికేయులు విష్ణు దాస్, గోపాల్ రావు, మండల యాదగిరి, నాయకులు ,తాళ్ళపల్లి రమేష్తో పాటు ప్రజా సంఘాల నాయకులు,ఆర్టీసీ కార్మికులు, వివిధ కుల సంఘాల నాయకులు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను గళమెత్తారు.











