సిర్సపల్లి డంపింగ్ యార్డ్ రద్దు చేయకుంటే ప్రాణత్యాగానికైనా వెనుకాడను.. రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ మార్చి 28 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సిర్సపల్లి గ్రామ సరిహద్దుల్లో నిర్మించ తలపెట్టిన డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య ఈ ప్రాజెక్టును నెలకొల్పాలని చూడటం పాలకుల నిరంకుశత్వానికి నిదర్శనమని రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మండిపడ్డారు. శనివారం హుజూరాబాద్‌లో మహిళలు చేపట్టిన భారీ దీక్షా ధర్నా శిబిరానికి ఆయన హాజరై తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని భావోద్వేగంగా ప్రకటించారు.
ప్రజాభిప్రాయాన్ని కాలరాస్తూ గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు
ఏదైనా ఒక భారీ ప్రాజెక్టును నిర్మించేటప్పుడు స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించడం కనీస బాధ్యత అని, కానీ ఇక్కడ అధికారులు ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని రామారావు విమర్శించారు. ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, పనులను ప్రారంభించాలని చూడటం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. గత వారం రోజులుగా రైతులు, మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాబోయే తరాలకు విషతుల్యమైన వాతావరణం.
ఈ వ్యర్థాల శుద్ధి కేంద్రం వల్ల కలిగే పర్యావరణ విధ్వంసంపై రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు నుంచి వెలువడే ప్రమాదకరమైన రసాయనాలు, వాయువుల వల్ల గాలి కలుషితమై ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పశువులకు గడ్డి, నీరు విషతుల్యమై పాల దిగుబడి తగ్గడమే కాకుండా, పాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని వివరించారు. ఈ కాలుష్య ప్రభావం కేవలం సిర్సపల్లికే పరిమితం కాకుండా, చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల వరకు వ్యాపించే అవకాశం ఉందని ఆయన సాంకేతిక విశ్లేషణ చేశారు.

వ్యవసాయం దెబ్బతింటే అన్నదాతల పరిస్థితి ఏమిటి?
రైతు మిత్ర ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డితో కలిసి ఇప్పల్ నర్సింగాపూర్ లో నిర్వహించిన నాయకుల సమావేశంలో రామారావు మాట్లాడుతూ.. భూగర్భ జలాలు కలుషితమైతే వ్యవసాయం కుంటుపడుతుందని, తద్వారా రైతులు ఆర్థికంగా చితికిపోతారని ఆవేదన చెందారు. సాగు భూములు నిస్సారమై, పాడి పంటలు నశించి, భవిష్యత్ తరాలు బతుకుదెరువు కోసం వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. పాలకులు తమ మొండి వైఖరి వీడి, తక్షణమే ఈ ప్రాజెక్టును జనావాసాలకు సుదూరంగా తరలించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో రైతు మిత్ర ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహ రెడ్డి నాయకులు, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, దండ వెంకట రమణారెడ్డి, బండి సమ్మయ్య, బండి శంకర్, గూడూరి చైతన్య రెడ్డి, తులసీ లక్ష్మణ్ కుమార్ దాస్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, భారీ సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ పనులు నిలిపివేసే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !