భద్రాద్రి నుంచి ‘రైతు మహాగర్జన’ గుర్రపు యాత్ర ప్రారంభం.. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పోలాడి రామారావు సమరభేరి..ఏప్రిల్ 28న కరీంనగర్‌లో లక్షలాది మందితో రాష్ట్ర స్థాయి సభ.

బాహు బలంన్యూస్ భద్రాచలం, మార్చి 27:
రాష్ట్రంలోని అన్నదాతలకు, విద్యార్థులకు మరియు వివిధ కుల సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి ‘రైతుల మహాగర్జన’ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భద్రాద్రి గుడి ముందు గుర్రమెక్కి తన యాత్రను ప్రారంభిస్తూ ప్రభుత్వంపై విమర్శల నాటు వేశారు..

నెరవేరని హామీలు.. వంచనకు గురైన రైతాంగం
​ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో 70 శాతం మందికి ఇంకా రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదని, బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించడం దారుణమని మండిపడ్డారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి, కేవలం సన్న రకాలకే అడపాదడపా ఇస్తూ రైతులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రైతు భరోసా నిధులను ఇప్పటికే రెండుసార్లు ఎగ్గొట్టిన సర్కారు, ఇప్పుడు నామమాత్రంగా విడుదల చేస్తూ రైతులను యాచకులుగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యా, సామాజిక రంగాల పట్ల వివక్ష.
​రైతులతో పాటు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని రామారావు విమర్శించారు. అగ్రకుల పేదల కోసం ప్రకటించిన రెడ్డి కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్లు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, వీటికి బడ్జెట్ కేటాయింపులు లేకపోవడమే కాకుండా పాలక మండళ్లను కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో సమరభేరి.

అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 28న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓసీ జేఏసీ, రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో “రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి” సభను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లు:
​రుణమాఫీ: అర్హులైన ప్రతి రైతుకు రూ. 2 లక్షల రుణమాఫీ తక్షణమే పూర్తి చేయాలి.
రైతు భరోసా & బోనస్: సాగు సమయానికే రైతు భరోసా నిధులు ఇవ్వాలి. ధాన్యపు కొనుగోలు సమయంలోనే క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లించాలి.
కౌలు రైతులు & మద్దతు ధర: కౌలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. పెట్టుబడికి తగినట్లుగా గిట్టుబాటు ధర కల్పించాలి.
ప్రకృతి వైపరీత్యాలు: నష్టపోయిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలి.
నీటి యాజమాన్యం: ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలి.
ఉపాధి హామీ: కూలీల కొరత దృష్ట్యా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.
భద్రత & పెన్షన్: రైతు బీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలి. ప్రతి రైతుకు నెలకు రూ. 6,000 జీవన భృతి (పెన్షన్) కల్పించాలి.
​వైద్యం: కార్పొరేట్ ఆస్పత్రుల్లో రైతులకు రూ. 20 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలి.
రిజర్వేషన్లు: ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్ల అమలుకై జాతీయ, రాష్ట్ర స్థాయి ఓసీ కమిషన్లు ఏర్పాటు చేయాలి. ఆదాయ పరిమితిని పెంచి, సర్టిఫికెట్ గడువును 5 ఏళ్లకు పెంచాలి.
నిరుద్యోగం: ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి.
​ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, జాతీయ నాయకులు సాంబశివరావు, నాయకులు అయిత నాగరాజు, రాజయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !