బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఫిబ్రవరి 10:21వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పంజాల మనోజ్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంగళవారం వార్డులోని వివిధ బస్తీల్లో పర్యటించిన ఆయనకు మహిళలు, యువత ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు ప్రజల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని, ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. మార్పు దిశగా అడుగులు వేయాలని, కమలం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు.
తన ఎన్నికల ప్రణాళికలో భాగంగా మనోజ్ కుమార్ పలు కీలక హామీలను ప్రకటించారు. ఆడబిడ్డల వివాహాలకు రూ. 10,116 మేర నగదు ప్రోత్సాహకం అందించడంతో పాటు, నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు వార్డులోనే ‘జాబ్ మేళా’లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఆరు నెలలకోసారి ఉచిత వైద్య శిబిరాలు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, వీధి వీధినా సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా భద్రతను పటిష్టం చేస్తానని హామీ ఇచ్చారు. పారిశుధ్య కార్మికుల సమన్వయంతో వార్డును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతూ, కాలుష్య రహిత వాతావరణాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. అవినీతి లేని పాలన కోసం, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు.











