బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఫిబ్రవరి 09:
హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బి.ఆర్.ఎస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థి ఇల్లందుల మౌనిక తన విజయం లక్ష్యంగా వార్డులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. విద్యావంతురాలైన ఆమె (M.Com, B.P.Ed), వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. “ఒక్క అవకాశం ఇచ్చి చూడండి.. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డు రూపురేఖలు మారుస్తాను” అంటూ ఆమె ఓటర్లకు ఉద్వేగపూరిత విజ్ఞప్తి చేస్తున్నారు.
వార్డు సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ఇల్లందుల మౌనిక 11 ప్రధాన అంశాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల ముందుకు తెచ్చారు. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేయడం, సి.సి. రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలకు తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతి ఆరు నెలలకోసారి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, వృద్ధులకు కంటి పరీక్షలు చేయించి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తానని భరోసా ఇచ్చారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కుట్టు శిక్షణ కేంద్రాల ఏర్పాటు, యువత కోసం రీడింగ్ రూమ్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తానని స్పష్టం చేశారు.
వార్డు ప్రజల కష్టాలను తన సొంత కష్టాలుగా భావించి, అవినీతికి తావులేకుండా నిరంతరం అందుబాటులో ఉండే ఒక సేవకురాలిగా పనిచేస్తానని మౌనిక పేర్కొన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం
జరిగే పోలింగ్లో ఓటర్లందరూ కారు గుర్తుపై ఓటు వేసి, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చదువుకున్న బిడ్డగా వార్డు అభివృద్ధి కోసం కష్టపడే తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని ఆమె మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు.












