బాహు బలంన్యూస్,కరీంనగర్ ఆగస్టు 06 :
ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి శ్వాసగా, చుక్కానిగా నిలిచి స్వరాష్ట్ర ఆకాంక్షను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పిన మహోన్నత జ్ఞాని, సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కొనియాడారు. గురువారం కరీంనగర్లోని కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం సమీపంలో ఉన్న మదీనా కాంప్లెక్స్ వద్ద ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
1934 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో మహాలక్ష్మి, లక్ష్మీకాంతారావు దంపతులకు జన్మించిన జయశంకర్ సార్, బహుభాషా కోవిదుడిగా, ఆజన్మ బ్రహ్మచారిగా తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ మట్టికే అంకితం చేశారని పోలాడి రామారావు గుర్తుచేశారు. బెనారస్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పట్టా పొంది, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేశారని వివరించారు. సీకేఎం కాలేజీ ప్రిన్సిపాల్గా, కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా, ఉపకులపతిగా విద్యా రంగానికి విశేష సేవలందించారన్నారు.
ఉద్యమ అగ్నిరవ్వలు.. ఉద్యమానికి దిక్సూచి
పాఠశాల దశలోనే ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ నినాదంతో పోరాటం ప్రారంభించిన జయశంకర్ సార్, 1952 నాన్-ముల్కీ ఉద్యమంలో, 1954 విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమంలో, 1969 తొలిదశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని రామారావు తెలిపారు. 1995 మలిదశ ఉద్యమానికి మార్గదర్శకుడిగా, వెన్నెముకగా నిలిచారని పేర్కొన్నారు. “మా వనరులపై మాకే పూర్తి అధికారం కావాలి.. యాచక దశ నుంచి శాసన దశకు తెలంగాణ రావాలి” అని లెక్కలతో సహా అన్యాయాలను ఎండగట్టారన్నారు. నిజాం కాలం నాటి గొలుసుకట్టు చెరువుల విధ్వంసాన్ని ప్రశ్నిస్తూ, స్వయంపాలనలో వాటి పునరుద్ధరణ ఆవశ్యకతను ఆనాడే చాటిచెప్పారని గుర్తుచేశారు.
2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం, కేసీఆర్ నాయకత్వానికి మద్దతు ఇవ్వడం నుంచి.. 2009 నాటి కేసీఆర్ ఆమరణ దీక్ష, శ్రీకాంతాచారి ఆత్మాహుతి, కేంద్ర హోంశాఖ ప్రకటనల తదనంతర రాజీనామాల ఉద్యమ కాలంలో జయశంకర్ సార్ ధైర్యంగా నిలిచారని రామారావు కొనియాడారు. కవులు, కళాకారులు, రచయితలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, కుల సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపారన్నారు. “పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా తెలంగాణది”గా జీవించిన త్యాగశీలి ఆయన అని చెప్పారు.
ఆశయ సాధనే నిజమైన నివాళి
గొంతు క్యాన్సర్తో బాధపడుతూ 2011 జూన్ 21న కన్నుమూసిన జయశంకర్ సార్, ప్రత్యేక రాష్ట్రాన్ని చూడలేకపోయినా ఆయన సిద్ధాంత ఫలమే నేటి తెలంగాణ అని రామారావు తెలిపారు. ఆయన సేవల గుర్తింపుగా ప్రభుత్వం ‘జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ’, ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లా’, ‘జయశంకర్ బడిబాట’ వంటి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆయన కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జయశంకర్ సార్ ఆశయాల సాధనకు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల రక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పెండ్యాల కేశవరెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, జన్ను జయరాజు, నర్సయ్య, జిల్లా అంజయ్య తదితరులు పాల్గొన్నారు.











