బాహు బలంన్యూస్ హుజురాబాద్,ఫిబ్రవరి 09:పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాంపెళ్లి శ్రీనివాస్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వార్డులోని ప్రతి గల్లీని చుడుతూ, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ భారీ మద్దతును కూడగట్టుకుంటున్నారు. ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వార్డు రూపురేఖలు మార్చడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గెలిచిన ఏడాది కాలంలోనే వార్డులో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా బాయలకాడికి వెళ్లే రాగట్లో నూతన రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు, హనుమాన్ టెంపుల్ సమీపంలో ప్రజల నీటి అవసరాల కోసం ప్రత్యేక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. అలాగే హనుమాన్ టెంపుల్ పరిసర ప్రాంతాలతో పాటు, పద్మశాలీ కాలనీలో పూర్తిస్థాయిలో సిసి రోడ్ల నిర్మాణం చేపడతానని, ముదిరాజ్ సామాజిక వర్గానికి అవసరమైన పంపు సెట్ల పంపిణీ వంటి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని పేర్కొన్నారు.
తాను అధికార పార్టీలో ఉన్నందున నిధుల కొరత లేకుండా చూస్తానని, మీ ఇంట్లో పెద్ద కొడుకులా ఉండి ప్రతి సమస్యను తీరుస్తానని ఆయన ప్రజలకు విన్నవించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు, మరియు జిల్లా ఇంచార్జ్ తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో వార్డు అభివృద్ధికి భారీగా నిధులు తీసుకువస్తానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. శ్రీనివాస్ ప్రచారానికి వార్డు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువత ఆయనకు బ్రహ్మరథం పడుతుండటంతో 24వ వార్డులో కాంగ్రెస్ ప్రచారం హోరెత్తుతోంది. అభివృద్ధి చేసే వ్యక్తికే తమ ఓటు అని వార్డు వాసులు స్పష్టం చేస్తుండటంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
















