బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఫిబ్రవరి 01: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పురపాలక సంఘ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మూడవ వార్డులో తమ దూకుడును ప్రదర్శించాయి. ఆదివారం జరిగిన ముమ్మర ప్రచారంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు పాల్గొని, పార్టీ అభ్యర్థి రావుల ప్రభాకర్తో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా వార్డులో కాంగ్రెస్ శ్రేణులకు స్థానిక ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. మహిళలు హారతులు పట్టి, యువత భారీ కేకల మధ్య అభ్యర్థికి ఘనస్వాగతం పలికారు. ప్రణవ్ బాబు మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు కేవలం ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోనే సాకారం అయ్యాయని గణాంకాలతో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి గడపకు చేరుతున్నాయని, ఈ అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్డు అభ్యర్థి రావుల ప్రభాకర్ ప్రతి గడపకూ వెళ్లి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి మౌలిక వసతుల కల్పనే తన తొలి ప్రాధాన్యత అని ఆయన ఓటర్లకు భరోసా ఇచ్చారు. ప్రజలు తమపై చూపిస్తున్న ఈ అభిమానం చూస్తుంటే కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వార్డులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించాలంటే చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి కీలక నేతలు, వార్డు ఇన్చార్జిలు, అనుబంధ సంఘాల నాయకులు మరియు వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. కాంగ్రెస్ శ్రేణుల నినాదాలతో 3వ వార్డు పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి. అభివృద్ధికి పట్టం కడతామని, ఈసారి తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని ఓటర్లు ముక్తకంఠంతో హామీ ఇవ్వడం గమనార్హం.












