బాహుబలం న్యూస్, హుజూరాబాద్, ఫిబ్రవరి 01 :కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉచిత ‘స్వర్ణామృత ప్రాశన’ (స్వర్ణ బిందు ప్రాశన) పంపిణీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. స్థానిక శ్రీ రామాంజనేయ దేవస్థాన ప్రాంగణంలో గోమతి విద్య గోశాల గోసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తోగరు కుమార స్వామి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి పెరుమాండ్ల హైమా – బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్ స్వయంగా చిన్నారులకు ఆయుర్వేద ఔషధ చుక్కలను వేసి ఈ పంపిణీని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయుర్వేద శాస్త్రం అందించిన ఈ అద్భుత ఔషధాన్ని గ్రామంలోని పిల్లలందరికీ అందజేయడం అభినందనీయమని, దీనివల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు లభిస్తుందని పేర్కొన్నారు.
ఉదయం 7:00 నుండి 8:00 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో 6 నెలల నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలకు స్వర్ణ భస్మం, అష్ట మంగళ ఘృతం, తేనె వంటి అరుదైన మూలికలతో కూడిన ఔషధాన్ని వేశారు. ఈ ఔషధం ద్వారా జ్ఞాపకశక్తి, విశ్లేషణా సామర్థ్యం మెరుగుపడటమే కాకుండా, చిన్నారులను వేధిస్తున్న హైపర్ యాక్టివిటీ (ADHD), ఆటిజం వంటి సమస్యల నివారణకు ఇది ఎంతో మేలు చేస్తుందని నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో తల్లులు తమ పిల్లలతో కలిసి పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం 9908860578 లేదా 9063470111 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.










