బాహు బలంన్యూస్ హుజూరాబాద్ జనవరి 31: అనాదిగా అడవి తల్లులైన సమ్మక్క-సారక్క దేవతల సాక్షిగా వెదురుపై ఆధారపడి జీవిస్తున్న మేదరి కులస్తులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని హుజూరాబాద్ మేదరి మహేంద్ర సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల్లో మేదరులు ఇప్పటికే ఎస్టీ (ST) కేటగిరీలో కొనసాగుతున్నారని, అదే విధంగా తెలంగాణలో కూడా తమను తక్షణమే ఎస్టీ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు.
గత ఏడాది ఆగస్టు 7న ఆదిలాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మేదరి కులస్తుల సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారని సంఘం ప్రతినిధులు గుర్తు చేశారు. అయితే, ఆ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ ఆచరణలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం హామీలతో సరిపెట్టకుండా, క్షేత్రస్థాయిలో తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరారు.
వృత్తిపరంగా వెదురు పనిపై ఆధారపడిన మేదరులు ప్రస్తుతం అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని వారు కోరారు. ప్రభుత్వం స్పందించి త్వరలోనే తమను ఎస్టీలుగా గుర్తించి, ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాలని హుజూరాబాద్ మేదరి మహేంద్ర
సంఘం నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు.









