బాహు బలంన్యూస్ కరీంనగర్, ఆగస్టు: ఆచార్య జయశంకర్ సార్ ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి చుక్కానిగా నిలిచి, స్వరాష్ట్ర కాంక్షను ప్రపంచ వేదికపై చాటిచెప్పిన మహాజ్ఞాని, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ సార్ అని కొనియాడారు.
ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని గురువారం కరీంనగర్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మదీనా కాంప్లెక్స్ వద్ద ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొల్పిన జయశంకర్ సార్ విగ్రహానికి జేఏసీ నాయకులతో కలిసి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మలిదశ ఉద్యమానికి దిక్సూచి
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే శ్వాసగా బతికి, నాలుగున్నర కోట్ల ప్రజల్లో స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని గుర్తుచేశారు. ఈ నేల మట్టి బిడ్డగా, సిద్ధాంతకర్తగా అణచివేతపై గళమెత్తి మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ జాతి పితృసమానుడైన జయశంకర్ సార్ జయంతి వేళ ఆయనకు శతకోటి ప్రణామాలు అర్పిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రయోజనాల రక్షణకు ప్రతిజ్ఞ
జయశంకర్ సార్ ఆశయాల సాధనతో పాటు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, అందుకు జేఏసీ సదా సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా వారు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ‘జయశంకర్ సార్ అమర్ రహే’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పెండ్యాల కేశవరెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, జన్ను జయరాజు, నర్సయ్య, జిల్లా అంజయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











