బాహు బలంన్యూస్ ఇల్లందకుంట, న్యూస్టుడే: ప్రజాపాలన ద్వారా ప్రతి గడపకూ సంక్షేమాన్ని, ప్రతి ఇంటికీ అభివృద్ధి ఫలాలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. గురువారం మండలంలోని ఇల్లందకుంట, చిన్నకోమటిపల్లి, టేకుర్తి, బూజునూరు, రాచపల్లి, మల్లన్నపల్లి, శ్రీరాములపల్లి, కనగర్తి, లక్ష్మాజీపల్లి, మల్యాల, వాగొడ్డు రామన్నపల్లి గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి దాదాపు రూ.8 లక్షల విలువైన 24 సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను అందజేశారు.
అనంతరం శ్రీరాములపల్లిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయాల్లో రాజీపడేది లేదని తేల్చిచెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట దేవాలయ ఛైర్మన్ రామారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











