బాహు బలంన్యూస్ సైదాపూర్: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొయ్యడ మధును కోల్పోయి, తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల చిన్నారి అక్షరకు సామాజిక వేత్త సబ్బని వెంకట్ అండగా నిలిచారు. సైదాపూర్ మండలం రామచంద్రపూర్ (ఆగ్రా రం) గ్రామానికి చెందిన బీఎస్పీ నాయకుడు కొయ్యడ మధు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, అదే ప్రమాదంలో ఆయన కుమార్తె అక్షర కుడి చేయి, కుడి కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆ చిన్నారి వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
చిన్నారికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన అనంతరం, సబ్బని వెంకట్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్, సంబంధిత వైద్యులతో మాట్లాడారు. శస్త్రచికిత్స, అత్యవసర వైద్యం కోసం అవసరమైన ‘బి-నెగెటివ్’ (B-ve) రక్తాన్ని దాతల ద్వారా ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
బాధిత కుటుంబం అత్యంత పేదరికంలో ఉండటంతో తనవంతు సాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. చిన్నారి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు దగ్గరుండి చూసుకుంటామని వెంకట్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.











