బాహు బలంన్యూస్ హుజూరాబాద్ జనవరి 08 : ప్రజాసేవలో ఎన్నికైన ప్రతినిధులు అంకితభావంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని కూరపాటి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. హుజురాబాద్ మండల నూతన ప్రజాప్రతినిధుల అభినందన సభను కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై మండలంలోని నూతన సర్పంచులు, ఉపసర్పంచులు మరియు వార్డు సభ్యులను డాక్టర్ కూరపాటి రమేష్ – రాధిక దంపతులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్యం మెరుగుపడాలంటే గ్రామ స్థాయిలో పాలకవర్గాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు, పేద ప్రజలకు అండగా నిలిచేందుకు కూరపాటి ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసినప్పుడే ఆదర్శ గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, వివిధ గ్రామాల పెద్దలు మరియు కార్యకర్తలు పాల్గొని నూతన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.










