బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జనవరి 07: హుజూరాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. పండుగకు ముందే పాఠశాల ఆవరణలో గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో సంక్రాంతికి విశిష్ట స్థానం ఉందని, రైతుల శ్రమకు గౌరవం దక్కే పవిత్రమైన పండుగ ఇదని కొనియాడారు. ప్రకృతితో మమేకమై కష్టపడే తత్వాన్ని, ఐక్యతను చాటిచెప్పే ఇలాంటి పండుగలను జరుపుకోవడం వల్ల విద్యార్థులలో మన సాంప్రదాయాల పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు. మన పూర్వీకులు అందించిన గొప్ప సంస్కృతిని కాపాడుకుంటూ, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
అనంతరం డాక్టర్ నరేందర్ రెడ్డి విద్యార్థులతో కలిసి వరి నాట్లు వేసి వ్యవసాయంపై మక్కువను చాటారు. కిండర్ గార్డెన్ చిన్నారులపై భోగి పళ్లు పోసి ఆశీర్వదించగా, సంప్రదాయబద్ధంగా వేసిన భోగి మంటలతో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, గ్రామీణ వృత్తుల విశిష్టతను తెలిపే వేషధారణలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను దిగ్విజయం చేశారు.















