హుజూరాబాద్ మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా వన్నాల శివాజీ ఏకగ్రీవ ఎన్నిక

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జనవరి 08: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఘనంగా ఎన్నుకున్నారు. మండలంలోని రాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ వన్నాల శివాజీని ఫోరం అధ్యక్షుడిగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రకటించిన పూర్తి కార్యవర్గ వివరాల ప్రకారం.. గౌరవ అధ్యక్షుడిగా కందుగుల గ్రామానికి చెందిన మండల సతీష్, ఉపాధ్యక్షుడిగా రాజపల్లికి చెందిన శనిగరపు ఐలయ్య, ప్రధాన కార్యదర్శిగా చిన్నపాపయ్యపల్లికి చెందిన గీసిడి శైలజ-మహేందర్ రెడ్డి, కోశాధికారిగా పెద్దపాపయ్యపల్లికి చెందిన బండి రాజగౌడ్ బాధ్యతలు చేపట్టారు.
కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా బండి నరేష్ (రంగాపూర్), ఆవుల రాజు కుమార్ (ధర్మరాజు పల్లి), జనగామ రాజేశ్వరరావు (సిర్సపల్లి), ఇప్పలపల్లి రామకృష్ణ (అంబేద్కర్ నగర్), బొల్లవేణి అజయ్ (పోతిరెడ్డి పేట), గిన్నారపు మహేందర్ (జూపాక) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వన్నాల శివాజీ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మండలంలోని ఉపసర్పంచులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, ఐకమత్యంతో ఉపసర్పంచుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, గ్రామాల అభివృద్ధిలో ఉపసర్పంచుల పాత్రను మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని శివాజీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ఉపసర్పంచులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !