బాహు బలంన్యూస్ కమలాపూర్ డిసెంబర్ 14:నిస్వార్థ సేవ, మానవత్వ విలువలతో ప్రజల మనసులను గెలిచిన కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి మిట్టపల్లి మహేశ్వరి, ఆమె భర్త శ్రీ కుమార్ దంపతులకు ప్రతిష్ఠాత్మక ‘కష్టస్థాయి ఉత్తమ సేవ పురస్కారం’ లభించింది. వారి ఆదర్శప్రాయమైన సామాజిక సేవకు గుర్తింపుగా, మానవ విలువల పరిరక్షణ జాతి అధ్యక్షులు, తత్వవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ చేతుల మీదుగా ఈ గౌరవం దక్కింది.
స్థానిక కమలాపూర్లోని ఏకే మార్ట్, సూపర్ మార్ట్ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ నాగుల సత్యం గౌడ్, మహేశ్వరి కుమార్ దంపతులకు పట్టు శాలువా కప్పి, బొకేని అందించి, పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
ఈ వేదికపై డాక్టర్ నాగుల సత్యం గౌడ్ మాట్లాడుతూ, మొదటిసారిగా సర్పంచ్గా ఎన్నికైన మహేశ్వరి కుమార్ దంపతుల సేవానిరతి, ప్రజా సంక్షేమం పట్ల వారికున్న అంకితభావం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని ప్రశంసించారు. “ఈ దంపతులు కేవలం పదవికే పరిమితం కాకుండా, అత్యంత సహృదయంతో, సేవా భావంతో గ్రామ ప్రజలందరితో నిస్వార్థంగా కలిసి మెలిసి ఉంటున్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, తమకు తోచిన సహాయ సహకారాలను అందిస్తూ, గ్రామ ప్రజల అభిమానాన్ని చూరగొనడం నిజంగా అభినందనీయం,” అని ఆయన పేర్కొన్నారు. ప్రజాకవి, రచయితగా, వరల్డ్ రికార్డు అవార్డు గ్రహీతగా, సంపూర్ణ ఆధ్యాత్మిక బోధన గురువుగా గుర్తింపు పొందిన డాక్టర్ సత్యం గౌడ్, మహేశ్వరి కుమార్ దంపతుల సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో గంధ శ్రీ వినోద్, బైరి మౌనిక తదితరులు పాల్గొని సర్పంచ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయగా, గ్రామస్తులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సంతోషాన్ని పంచుకున్నారు.










