బాహు బలంన్యూస్ హుజూరాబాద్ డిసెంబర్ 14 : గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా (GSKDI), కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న హుజురాబాద్ పట్టణ కరాటే విద్యార్థులు రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. జగిత్యాలలో జరిగిన ఈ రాష్ట్రస్థాయి పోటీలలో హుజురాబాద్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో మొత్తం 9 బంగారు పతకాలు (గోల్డ్ మెడల్స్) మరియు 2 రజత పతకాలు (సిల్వర్ మెడల్స్) సాధించి పట్టణానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారు.
ఈ అపూర్వ విజయం సాధించిన విద్యార్థులను హుజురాబాద్ పట్టణంలోని స్థానిక న్యూ కాకతీయ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులు విజేతలను శాలువాలతో సత్కరించి, సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు రత్నం మాట్లాడుతూ, నేటి సమాజంలో కరాటే శిక్షణ ఆడపిల్లలకు అత్యంత అవసరమని, ఇది వారి ఆత్మస్థైర్యాన్ని పెంచడంతోపాటు, ధైర్యంగా ముందడుగు వేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ కృషిని ఆయన ఎంతగానో కొనియాడారు. కరాటే కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా, పిల్లలలో మానసిక పరిపక్వతను, క్రమశిక్షణను పెంపొందిస్తుందని, తద్వారా సామాజిక స్పృహతో పాటు జాతీయ సమైక్యత భావం కలిగిన ఉత్తమ పౌరులుగా ఎదగడానికి అవకాశం కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు.
గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా ప్రముఖులందరూ అభినందించి, తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో రిటైర్డ్ పీటీ సారయ్య, మహాత్మా అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు ఎండి ఖలీద్ హుస్సేన్, మహాత్మ జ్యోతిరావు పూలే మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, కొలిపాక సమ్మయ్య, రిటైర్డ్ ఎంఈఓ జమదగ్ని లక్ష్మణామూర్తి, మేకల మల్లేష్, గోస్కుల మధు, గోస్కుల నాగమణి, ఎండి నవాబ్, మైనార్టీ నాయకులు ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు










