బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 4: జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ప్రాతినిధ్యంలోనూ సగం వాటా దక్కినప్పుడే సామాజిక న్యాయం సంపూర్ణమవుతుందని ‘కోటి ఉత్తరాల ఉద్యమ’ రూపకర్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం హుజూరాబాద్లోని బీసీ నాయకుడు బండారి సదానందం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ‘బీసీ మేనిఫెస్టో’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అడవుల్లోని జంతువుల నుంచి రోడ్లపై ఉన్న పశువుల వరకు లెక్కించే ప్రభుత్వాలకు, బీసీల కుల గణన చేపట్టడానికి పట్టింపు లేకపోవడం దారుణమన్నారు. “మేమెంతో-మాకంతే” అనే సూత్రాన్ని పాలకులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం బీసీ కులాలన్నీ ఒక్కటై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజీపేట శ్రీనివాస్, నాయకులు కూరపాటి రామచంద్రం, సంగెం శ్రీనివాస్, పంజాల వెంకటేష్, నేరెళ్ల మహేందర్ గౌడ్, గాలి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.










