బాహు బలంన్యూస్ హుజూరాబాద్,: హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. నిజమైన నిరుపేదలను పక్కనబెట్టి, కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న అనర్హులకు ఇళ్లను కట్టబెట్టారని మండిపడ్డారు. బుధవారం హుజూరాబాద్లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఫ్లోర్, కౌన్సిలర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మున్సిపల్ పాలన అవినీతికి అడ్డాగా మారిందని దుయ్యబట్టారు. అర్హులైన పేదల హక్కులను కాలరాస్తున్న అధికారుల తీరుపై బీజేపీ చూస్తూ ఊరుకోదని, బాధితులకు న్యాయం జరిగే వరకు పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు, కౌన్సిలర్లు కొలుగురి సుమలత, దామెర అనూష, పంజాల మనోజ్, కొండ ప్రశాంతి, మంచికట్ల మురళి, దామెర అనురాగ్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు











