బేడ బుడగ జంగాల కాలనీని వెంటనే అభివృద్ధి చేయాలి: బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు డిమాండ్.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, నవంబర్ 4
హుజురాబాద్ పట్టణంలోని బేడ బుడగ జంగాల కాలనీని వెంటనే అభివృద్ధి చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు డిమాండ్ చేశారు. మంగళవారం హుజురాబాద్ బుడగ జంగం కాలనీ నుంచి మున్సిపల్ కార్యాలయం దాకా కాలనీవాసులతో కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన ఒక మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.
40 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని కాలనీ:
“మేము బేడ బుడగ జంగాల కులానికి చెందిన వాళ్లం. గత 40 సంవత్సరాలుగా హుజురాబాద్ పట్టణంలోనే నివసిస్తున్నాం. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా, ఎంతమంది నాయకులు మారినా… మా కాలనీ అభివృద్ధికి పూర్తిగా నోచుకోలేదు” అని సిరిపాటి వేణు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల ముందు నాయకులు తమ కాలనీకి వచ్చి సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, మిషన్ భగీరథ పైప్‌లైన్లు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తామని బొకహామీలు ఇస్తున్నారని, కానీ ఎన్నికలు కాగానే మమ్మల్ని మర్చిపోతున్నారని ఆయన విమర్శించారు.
వర్షాకాలంలో దుర్భర జీవితం:
వర్షాకాలం వచ్చిందంటే చాలు ‘అయ్యో పాపం’ అని జాలి చూపడం తప్ప, తమ దుస్థితిని మార్చే ప్రయత్నం చేయడం లేదని సిరిపాటి వేణు పేర్కొన్నారు. తమ ప్రాంతంలో పరిశుభ్రత లేక, డ్రైనేజీ కాలువలు లేక మురికి నీరు నిలిచిపోయి ఎందరో అనారోగ్యాల పాలవుతున్నారని ఆయన తెలిపారు. ఈ సమస్యలను గత 40 సంవత్సరాలుగా పాలించిన నాయకులు, అధికారులు, కలెక్టర్ల దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లినా అభివృద్ధి జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి:
అధికారులకు, స్థానిక నాయకులకు ఆయన ఈ కింది విధంగా విజ్ఞప్తి చేశారు:
కాలనీలో నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి.
తక్షణమే కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, మిషన్ భగీరథ పైప్‌లైన్లు, వీధి లైట్లు, స్మశాన వాటిక మరియు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ముఖ్యంగా, హుజురాబాద్ మున్సిపాలిటీకి మంజూరైన 15 కోట్ల నిధులలో మా బేడ బుడగ జంగాల కాలనీకి కూడా నిధులు కేటాయించి, అభివృద్ధి చెందని కాలనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.
అభివృద్ధి జరిగే వరకు పోరాటం ఆగదు:
తమ సమస్యలను పరిష్కరించకపోతే, త్వరలోనే హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద 2000 మందితో భారీ ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమ పోరాటం అభివృద్ధి జరిగే వరకు ఆగదు అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సిరిపాటి వేణు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !