బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 03: హుజూరాబాద్ సివిల్ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులు ఆరు నెలల నుంచి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించకపోతే, ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామని వారు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం హాస్పిటల్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం, జీతాల గురించి అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలను సంప్రదిస్తే వారు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అధికారులను అడిగితే కాంట్రాక్టర్ పేరు చెబుతుండగా, కాంట్రాక్టర్ మాత్రం ప్రభుత్వ నుంచి బిల్లులు రావడం లేదని సమాధానం ఇస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఈ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నిరసనలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కదిరే రమేష్ మాట్లాడుతూ, కార్మికుల సమస్యను పరిష్కరించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. గత ఆగస్టు 24వ తేదీన హాస్పిటల్ సూపరింటెండెంట్కు సమ్మె నోటీసు కూడా అందజేశామని తెలిపారు.
ప్రజల ఆరోగ్యం, కార్మికుల జీవితాలు రెండింటినీ దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా జీతాలు లేకుండా కార్మికులు పడుతున్న కష్టాలు శోచనీయమని, ఈ పరిస్థితిలో వారికి పోరాటం తప్ప మరో మార్గం లేదని రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ సివిల్ హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










