బాహు బలం న్యూస్ కరీంనగర్ జూన్ 05:రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పీడీఎస్యూ (PDSU) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో మొండయ్యకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్ మాట్లాడుతూ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను తీవ్రంగా దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టం అమలును పర్యవేక్షించి, పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్య అందేలా చూడాలని పీడీఎస్యూ విజ్ఞప్తి చేసింది.
ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని పీడీఎస్యూ హెచ్చరించింది.










