బాహు బలంన్యూస్ విజయవాడ జూన్ 05:జర్నలిస్టుల కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు సడలింపు కల్పించాలని ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాంశు శుక్లా (ఐఏఎస్) తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ చొరవతో జర్నలిస్టుల కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభించనుంది.
Secretariat Journalists Association ప్రతినిధులు ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి, జర్నలిస్టుల పిల్లల ఫీజు సడలింపు కోసం విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఈ విజ్ఞప్తిపై డైరెక్టర్ శుక్లా వెంటనే స్పందించి, అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ అంశంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను కోరారు.
దీనిపై జిల్లా కలెక్టర్లు సానుకూలంగా స్పందిస్తూ, “జర్నలిస్టులకు ఎప్పుడైనా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము” అని హామీ ఇచ్చారు. ఒకటి లేదా రెండు రోజుల్లో సంబంధిత ఆదేశాలు జారీ చేయబడతాయని వారు డైరెక్టర్ హిమాంశు శుక్లాకు తెలిపారు.
ఫీజు రాయితీ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఏదైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా తమ జిల్లాల కలెక్టర్లను సంప్రదించి పరిష్కరించుకోవాలని డైరెక్టర్ హిమాంశు శుక్లా జర్నలిస్టులకు సూచించారు.
జర్నలిస్టుల పిల్లల విద్య కోసం తీసుకుంటున్న ఈ చొరవకు Secretariat Journalists Association ప్రెసిడెంట్ రాజా రమేష్, ఇతర ప్రతినిధులు, అలాగే ఇతర జర్నలిస్టుల సంఘాల నాయకులు ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాంశు శుక్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశంపై సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారధి కూడా సానుకూలంగా స్పందించడం అభినందనీయం అని వారు పేర్కొన్నారు.










