బాహుబలం బ్యూరో – హైదరాబాద్
ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగం కేంద్రం గుప్పెట్లోకి తీసుకునేందుకు కుట్ర జరుగుతున్నది. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఏకపక్షంగా జాతీయ విద్యావిధానం-2020ని మోడీ ప్రభుత్వం రూపొందించింది. నూతన విద్యావిధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను లాక్కుంటూనే దాన్ని అమలు చేయాలంటూ ఒత్తిడి పెంచుతున్నది. ఇంకోవైపు జీడీపీ, కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి ఎన్ని నిధులు కేటాయిస్తుందో స్పష్టత ఇవ్వలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టమొచ్చినట్టు నిధులను ఖర్చు చేయడానికి అవకాశముంటుంది.
దాని వల్ల బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధిక నిధులు, కేంద్రాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపే ప్రమాదమున్నది. జీడీపీలో ఆరు శాతం, కేంద్ర బడ్జెట్లో పది శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాలని కొఠారి కమిషన్ సిఫారసు చేసింది. ఇప్పుడు నూతన విద్యావిధానం ద్వారా సరిపోయినన్ని నిధులు కేటాయించకుంటే ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమయ్యే అవకాశమున్నది. దానివల్ల పేద పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదమున్నది. జాతీయ విద్యావిధానం వల్ల విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ పెరుగుతుంది. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకే ప్రోత్సాహం ఉంటుంది.
సంస్కృతం, హిందీ భాషలకే ప్రాధాన్యత
ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో మాతృభాషతోపాటు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన సాగుతున్నది. కానీ ఎన్ఈపీలో సంస్కృతం, హిందీకే ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్థులపై బలవంతంగా ఆ భాషలను రద్దే ప్రమాదమున్నది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఆధునిక యుగంలో సంస్కృతం, హిందీ భాషలను నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని వల్ల విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడి ఉద్యోగాలు పొందుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కొఠారి కమిషన్ సిఫారసుల ప్రకారం దేశంలో 10+2+3 విద్యావిధానం అమల్లో ఉన్నది. నూతన విద్యావిధానం ప్రకారం పాఠ్య ప్రణాళిక బోధనా నిర్మాణాన్ని 5+3+3+4గా మార్చాలని ప్రతిపాదించింది. దాని వల్ల విద్యారంగం గందరగోళానికి గురవుతుంది. పాఠశాల విద్యారంగం ధ్వంసమవుతుంది. ఈ ఆలోచనను విరమించుకోవాలని తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘విద్యారంగంలో వస్తున్న మార్పుల పయనం ఎటువైపు?’అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఒకటి నుంచి 12వ తరగతి వరకు సిలబస్ను జాతీయ విద్యా, పరిశోధన శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ) రూపొందిస్తుంది. ఆర్ఎస్ఎస్, హిందూత్వ భావజాలం ఉండేలా సిలబస్ను రూపకల్పన చేస్తుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహాత్మాగాంధీ, అంబేద్కర్, భగత్సింగ్ వంటి వారి చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగించి భగవద్గీతను సిలబస్లో చేర్చింది. ఆర్ఎస్ఎస్ నాయకులైన హెడ్గేవార్, వీడి సావర్కర్ వంటి చరిత్రను చేరుస్తున్నది.
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభమయ్యేనా?
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ పాఠశాలను నియోజకవర్గానికి ఒకటి ప్రారంభిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా ప్రస్తుత బడ్జెట్లో రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఇంత వరకు దానిపై ఎలాంటి ప్రణాళికను రూపొందించలేదు. ఎప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టత లేదు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేదు. మౌలిక వసతుల లేమి వెంటాడుతున్నది.
మరుగుదొడ్లు, తాగునీరు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తామంటూ ఊదరగొడుతున్నది. ఇంకోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటి నుంచి మూడో తరగతి వరకు బోధన సాగిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. దానిపై పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక తరగతులు (ప్రీప్రైమరీ) విద్యను అందించాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని 17 విశ్వవిద్యాలయాలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఐటీఐ కాలేజీల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాల్సిన అవసరమున్నది. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి అవసరమైన నైపుణ్యాన్ని అక్కడే అందించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాలని భావిస్తున్నది. దాని వల్ల బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించడానికి అవకాశం లభిస్తుంది తప్ప తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు దొరకవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలి : కె లక్ష్మినారాయణ
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కె లక్ష్మినారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహారం అందించాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా ప్రయివేటు పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వొద్దని సూచించారు. ప్రస్తుతం నడుస్తున్న వాటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు.










