బాహు బలంన్యూస్,కరీంనగర్, ఆగస్టు 13 : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వయానా సోదరుడైన జోగినపల్లి శ్రీనివాసరావు ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల పోలాడి రామారావు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఓసీ జేఏసీ తరఫున నివాళులర్పించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతం, బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన శ్రీనివాసరావు హైదరాబాద్లోని ఆల్వాల్లో స్థిరపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఈ సందర్భంగా కరీంనగర్లో పోలాడి రామారావు నేతృత్వంలో ఓసీ జేఏసీ నాయకులు శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఓసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ జేఏసీ రాష్ట్ర నాయకులను అప్పటి మంత్రి తన్నీరు హరీశ్రావు ద్వారా అప్పటి సీఎం కేసీఆర్తో సమావేశ పరిచేలా శ్రీనివాసరావు ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. ఆ చొరవ వల్లే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్ల అమలు, అర్హత నిబంధనల సడలింపు, వయోపరిమితి పెంపు వంటి కీలక డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించి జీవోలు విడుదల చేసిందని పోలాడి రామారావు పేర్కొన్నారు.
శ్రీనివాసరావు పేదలకు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు పోలాడి రామారావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతిరెడ్డి, రాష్ట్ర నాయకులు చెన్నమనేని పురుషోత్తం రావు, అప్పమ్మగారి రాంరెడ్డి, చందుపట్ల నర్సింహారెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, జున్నుతుల రాజిరెడ్డి, గూడూరి స్వామిరెడ్డి, బండ గోపాల్ రెడ్డి, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, తాటిపల్లి రాజన్న, విష్ణుదాస్ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.










