బాహు బలంన్యూస్,హుజురాబాద్,సెప్టెంబర్ 12 :
రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ, ప్రజల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఎమ్మెల్సీ చింతపండు నవీన్పై ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెడ్లకు నీతి, జాతి లేవంటూ నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఆ పదవి రెడ్ల భిక్ష కాదా?
రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, మద్దతు లేకుండానే ఆయన ఎమ్మెల్సీ అయ్యారా అని ప్రభావతి రెడ్డి నిలదీశారు. రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నవీన్కు ఇతర వర్గాలపై ఇలా మాట్లాడే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
కులపిచ్చి రాజకీయాలు తగవు
సమాజంలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా సోదరభావంతో కలిసిమెలసి ఉంటున్నారని, రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. స్వశక్తితో రాణిస్తున్న బీసీ యువతను కించపరచడం దుర్మార్గమన్నారు. గతంలో ప్రజల సాయంతో బతికిన రోజులను మరిచి అహంకారంతో మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.











