బాహు బలంన్యూస్ కరీంనగర్ సెప్టెంబర్ 13:విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేద (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకూ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని వర్తింపజేయాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విదేశీ విద్య కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 3,008 మంది విద్యార్థులకు ఓవర్సీస్ పథకం కింద రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.179.90 కోట్ల నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు. అయితే, ఇదే పథకంలో ఈడబ్ల్యూఎస్ పేద విద్యార్థులను విస్మరించడం తీవ్ర విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో అగ్రవర్ణ పేద విద్యార్థుల భవిష్యత్తుకు అన్యాయం చేయవద్దని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు.
చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
సెప్టెంబరు 17ను తెలంగాణ విముక్తి దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో ఐదు వేల మందికి పైగా వీరులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాలకులు ఆ మహోన్నత చరిత్రను విస్మరించడం తగదన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని గౌరవిస్తూ అధికారిక వేడుకలు జరపాలని, సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని స్పష్టం చేశారు.
సమావేశంలో ఓసీ జేఏసీ నాయకులు, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.










