బాహు బలంన్యూస్ హైదరాబాద్ , సెప్టెంబర్ 12:
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్న ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల (ఈడబ్ల్యూఎస్) పేద విద్యార్థులకూ తక్షణమే ఓవర్సీస్ స్కీం వర్తింపజేసి, నిధులు మంజూరు చేయాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. శనివారం నగరంలో ఐకాస నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 3,008 మంది విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం ఓవర్సీస్ పథకం కింద రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.179.90 కోట్ల నిధులు విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇదే పథకంలో ఈడబ్ల్యూఎస్ పేద విద్యార్థులను పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఓసీ పేదలకు అన్యాయం చేయవద్దని ఆయన కోరారు.
చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
సెప్టెంబరు 17ను హైదరాబాద్ సంస్థాన విముక్తి దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పోలాడి రామారావు కోరారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాడు జరిగిన సాయుధ పోరాటంలో ఐదు వేల మందికి పైగా అమరులయ్యారని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసం గత, ప్రస్తుత ప్రభుత్వాలు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను విస్మరించడం తగదన్నారు. విముక్తి లేదా విలీనం ఏదో ఒక పేరుతో సాయుధ పోరాటాన్ని గుర్తించి, సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించడంతో పాటు ఈ పోరాట చరిత్రను భావితరాలకు తెలిసేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఐకాస నాయకులు ల్యాగల వీరారెడ్డి, బోయినపల్లి శ్రీనివాసరావు, కొత్తకొండ రవీందర్రావు, అండెం రమణారెడ్డి, తీగల లక్ష్మణ్రావు, దడిగాల వెంకటేశ్వరరావులతో పాటు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.










