బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 03 :
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పోతిరెడ్డిపేట ‘రచన మహిళా శక్తి’ స్వయం సహాయక సంఘం సభ్యులు కుట్టిన స్కూల్ యూనిఫామ్లను సోమవారం గండ్రపల్లి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను అప్పగించింది. ఇందులో భాగంగా పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన శ్రీ వినాయక గ్రామైక్య సంఘం సభ్యులైన ఇద్దరు మహిళలకు హైదరాబాద్లో ‘ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్’ (ToT) శిక్షణ ఇచ్చారు.
ఆ శిక్షణ ద్వారా స్థానిక మహిళా టైలర్ల సహకారంతో గండ్రపల్లి గురుకుల పాఠశాలలోని 640 మంది విద్యార్థినులకు కావలసిన యూనిఫామ్లను నాణ్యతతో కుట్టించి, పాఠశాల అధికారులకు అందజేసినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ (సి.సి) బి. శ్రీనివాస్, వి.ఓ.ఎ టి. శ్రీలత, మహిళా సంఘాల సభ్యులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











