బాహు బలంన్యూస్ హుజూరాబాద్ : మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తమ వార్డులోని నిరుపేదలకే కేటాయించాలని 26వ వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రజాపాలన’లో వార్డు నుంచి 45 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 20 కుటుంబాలు అత్యంత దుర్భర పరిస్థితుల్లో అద్దె ఇళ్లల్లో కాలం వెళ్లదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకుల నాటి ఆస్తులను లబ్ధిదారుల ఖాతాలో చూపిస్తూ అర్హులను జాబితా నుంచి తొలగించడం సరికాదన్నారు. అధికారులే స్వయంగా వార్డులో సభలు నిర్వహించి, దరఖాస్తుదారుల ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని కోరారు.
రికార్డుల ఆధారంగా విచారణ జరిపి నిజమైన పేదలకు ఇళ్లు కేటాయించకపోతే, లబ్ధిదారుల సమక్షంలోనే తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు, మున్సిపల్ ఛైర్మన్ సుమలతలకు కూడా వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.










