బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఆగస్టు 02: హుజురాబాద్ పురపాలక పరిధిలోని గణేష్ నగర్ సర్వే నంబర్ 236లో దాదాపు రూ. 2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, సంపన్నులు యత్నిస్తున్నారని ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ఆరోపించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం… దాదాపు 24 ఏళ్ల క్రితం సర్వే నంబర్ 236లో అప్పటి అధికారులను మచ్చిక చేసుకుని కొందరు వ్యక్తులు తలా 10 గుంటల చొప్పున వ్యవసాయం చేసుకునేందుకు పాస్ పుస్తకాలు పొందారు. అయితే ఆ భూముల్లో ఇప్పటివరకు ఎలాంటి వ్యవసాయం చేయకపోవడంతో, గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించేందుకు సదరు హక్కుదారులకు నోటీసులు ఇచ్చి భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది.
ప్రస్తుతం అక్కడ భూముల ధరలు పెరగడంతో, నాటి వ్యక్తులే మళ్లీ రెవెన్యూ అధికారుల అండతో పట్టాలు చేసుకునేందుకు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారని సమ్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఈ విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ద్వారా అక్కడ నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.










