బాహు బలంన్యూస్,భీమదేవరపల్లి, జూలై 27 : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షన్నరకు పైగా ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితులను నెపంగా చూపిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్ నిధుల చెల్లింపుల నుంచి తప్పించుకోవడానికి, కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ఉండేందుకే ప్రభుత్వం వయోపరిమితిని పెంచి నిరుద్యోగ సమస్యకు కారణమవుతోందని ఆయన మండిపడ్డారు. సోమవారం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ప్రజా సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
హామీల అమలులో కాలయాపన
తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో చూపిన నిర్లక్ష్యం వల్లే యువత, నిరుద్యోగుల ఆగ్రహానికి గురై అధికారాన్ని కోల్పోయిందని రామారావు గుర్తుచేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, అన్నదాతలకు అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం.. పాలనా పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా కేవలం 36 వేల ఉద్యోగాలను మాత్రమే అరకొరగా భర్తీ చేసిందన్నారు. లక్షా యాభై వేలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా, విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను చెల్లించకపోవడం, నిరుద్యోగ భృతి హామీని పక్కన పెట్టడం, రైతులకు ఇచ్చిన మాటను విస్మరించడం సరికాదన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు.
హైదరాబాద్లో భారీ నిరసన
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న కోటి 68 లక్షల ఉద్యోగాలను సైతం తక్షణమే భర్తీ చేయాలని, కేంద్రం తన నిర్లక్ష్య ధోరణిని వీడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వచ్చే నెలలో హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద వేలాది మందితో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు వెల్దండి గౌతమ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, బోయినపల్లి శ్రీనివాసరావు, బచ్చు ఆనందంలతో పాటు ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.










