బాహు బలంన్యూస్ కరీంనగర్ జూలై 19 : రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్లోని ఒక హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన రాష్ట్ర, ఉమ్మడి జిల్లాల ప్రజా సంఘాల నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఆర్థిక పరిస్థితిని నెపంగా చూపిస్తూ, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ నిధుల చెల్లింపులను తప్పించుకోవడానికే ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ఇందులో భాగమే రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచడమని, ఈ నిర్ణయం వల్ల నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతోందని ఆయన మండిపడ్డారు.
హామీల అమలులో నిర్లక్ష్యం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ‘ఇంటికో ఉద్యోగం’ నినాదంతో అధికారంలోకి వచ్చిన గత పాలకులు పదేళ్లపాటు ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేశారని రామారావు గుర్తుచేశారు. నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేసినందుకే ఆనాడు పాలకులు ప్రజల ఆగ్రహానికి గురై మూల్యం చెల్లించుకున్నారని అన్నారు. యువతకు ఉద్యోగాలు, అన్నదాతలకు అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత పాలకులు పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. కేవలం 26 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని విమర్శించారు. మిగిలిన రెండు లక్షలకు పైగా ఖాళీలను భర్తీ చేయకుండా కుంటిసాకులతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో నిరుద్యోగ భృతి హామీని ఆటకెక్కించారని, విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీఇంబర్స్మెంట్ నిధులను కూడా సకాలంలో చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను సైతం ప్రస్తుత ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను పక్కనబెట్టి, ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ‘డైవర్షన్ పాలిటిక్స్’కు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు.
వచ్చే నెలలో హైదరాబాద్లో భారీ నిరసన
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఖాళీగా ఉన్న కోటి 68 లక్షల ఉద్యోగాల భర్తీపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని, వాటిని తక్షణమే భర్తీ చేయాలని ఈ సందర్భంగా రామారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పాలకుల నిర్లక్ష్యానికి నిరసనగా.. వచ్చే నెలలో హైదరాబాద్లోని ధర్నాచౌక్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఈ మేరకు తీర్మానించినట్లు మీడియాకు వెల్లడించారు.
ఈ సమావేశంలో ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, తాడిశెట్టి పశుపతి, కొత్తకొండ రవీందర్ రావు, పోరెడ్డి సత్యనారాయణ రెడ్డి, అండెం ప్రభాకర్ రెడ్డి, మహంకాళి రాజన్న, వేముల సుదర్శన్ రెడ్డి, మూగల మహేందర్ రెడ్డి, బోయినపల్లి శ్రీనివాస్ రావు, కాల్వ నర్సయ్య, బచ్చు ఆనందం తదితరులతో పాటు ఉమ్మడి జిల్లాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.











