బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూన్ 06:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ’లో భాగంగా శనివారం కాట్రపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ పెరుమాండ్ల హైమా బిక్షపతి అధ్యక్షతన, స్పెషల్ ఆఫీసర్ రాజేందర్, ఉప సర్పంచ్ గంగదారీ బిక్షపతి సమక్షంలో జరిగిన ఈ సభకు వివిధ శాఖల అధికారులు హాజరై ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.
గ్రామసభలో పారిశుద్ధ్య లోపం, వేలాడుతున్న విద్యుత్ లైన్ల సమస్యలపై గ్రామస్థులు అధికారులను నిలదీయగా, పరిష్కారానికి విద్యుత్ లైన్మెన్ హామీ ఇచ్చారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేయగా.. బాలల సంరక్షణ విభాగం ప్రతినిధి రమేష్ అవగాహన కల్పించారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రీ-ప్రైమరీ తరగతులు.
కాట్రపల్లి గ్రామానికి ఈ విద్యాసంవత్సరం నుంచే నూతనంగా ప్రీ-ప్రైమరీ స్కూల్ మంజూరైనట్లు, ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు సభలో వెల్లడించారు. అనంతరం ఏఈఓ నిఖిల్ కుమార్ రైతులకు సాగు విధానాలపై, ఇరిగేషన్ అధికారులు చెరువుల పరిస్థితిపై, వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధుల నివారణపై మాట్లాడారు.
సర్పంచ్ హైమా బిక్షపతి మాట్లాడుతూ.. 99 రోజుల కార్యాచరణ ద్వారా వార్డుల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి, నిధులు కేటాయించి కాట్రపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్, వార్డు సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.










