బాహు బలంన్యూస్ కరీంనగర్ , జూన్ 8: తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా, ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేక చేతులెత్తేసిందని రైతు జేఏసీ రాష్ట్ర నాయకుడు పోలాడి రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. అన్ని వర్గాల ప్రజలను వంచించిన ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే ఈ నెల 14న కరీంనగర్ వేదికగా ‘రైతు మహాగర్జన’ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
కంటితుడుపుగా ‘భరోసా’.. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ప్రధాన వాగ్దానాలన్నింటినీ ప్రభుత్వం అటకెక్కించిందని పోలాడి రామారావు విమర్శించారు. అన్ని రకాల పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రూ.15 వేల చొప్పున వార్షిక సాయం అందిస్తామన్న ఊసే ఎత్తడం లేదన్నారు. “రైతు రుణమాఫీని సైతం అరకొరగా చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికే రెండు విడతల రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్.. యాసంగి సీజన్ ముగిసినా కేవలం రెండు ఎకరాల లోపు ఉన్నవారికే కంటితుడుపుగా నిధులు విడుదల చేసింది. మిగిలిన 80 శాతం మంది రైతులకు మొండిచేయి చూపింది” అని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల 40 రోజుల పాటు జాప్యం జరిగిందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల పంపిణీలో ‘యాప్’ల పేరుతో కొత్త నిబంధనలు తీసుకువచ్చి రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు.
విద్యుత్ ప్రైవేటీకరణకు కుట్ర.. కుదేలైన గ్రామీణ వ్యవస్థ
రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి తెరవెనుక రంగాన్ని సిద్ధం చేస్తున్నారని రామారావు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ పడిపోతున్నా విద్యాశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో నాటిన చెట్లను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారని మండిపడ్డారు. గ్రామాల్లో మంచినీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం దారుణంగా ఉందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) పనితీరు అద్వాన్నంగా తయారైందని విమర్శించారు. రెవెన్యూ రంగంలో జవాబుదారీతనం లోపించడంతో సామాన్య ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇక్కట్ల పాలవుతున్నారన్నారు. సహకార సంఘాల్లో ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ పద్ధతిని ప్రవేశపెట్టడం సరికాదన్న ఆయన, రైతుల నీటి వినియోగదారుల సంఘాల (WUA) వ్యవస్థను పూర్తిగా మూలనపడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాసిరకం సన్నబియ్యం.. మహిళలు, నిరుద్యోగులకు మొండిచేయి
రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పేరుకే తప్ప, ఆచరణలో అత్యంత నాసిరకంగా ఉంటున్నాయని రామారావు పేర్కొన్నారు. గ్రామాల్లో కల్తీ మద్యం ఏరులై పారుతున్నా అడ్డుకునే నాథుడే లేడన్నారు. పంచాయతీరాజ్ పరిధిలోని గ్రామీణ రహదారులు గుంతలమయమై కనీస మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదని విమర్శించారు. మహిళలకు, నిరుద్యోగులకు ఇచ్చిన కీలకమైన హామీలపై ప్రభుత్వం కనీస దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.
14న కరీంనగర్లో సమరభేరి: వెనక్కి తగ్గేదే లేదు
ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేందుకు.. రాజకీయాలకతీతంగా ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో లక్షలాది మందితో ‘రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరి’ సభను నిర్వహిస్తున్నట్లు పోలాడి రామారావు వెల్లడించారు. ఈ సభ ద్వారా రైతుల, ప్రజల డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి రణభేరి మోగిస్తామన్నారు. ఈ మహాసభను భగ్నం చేయడానికి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, నిర్బంధాలు విధించినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలన్నింటినీ సర్కార్ పూర్తిగా నెరవేర్చే వరకు, ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోకుండా తెలంగాణ మలిదశ ఉద్యమ తరహాలో ఉధృతమైన పోరాటాలు చేస్తామని రామారావు హెచ్చరించారు.











