బాహు బలంన్యూస్ శంకరపట్నం/మానకొండూర్, ఏప్రిల్ 30: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే తరుణంలో రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని, ధాన్యం కొనుగోళ్లలో సర్కారు పూర్తిగా విఫలమైందని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు. గురువారం ఆయన మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని శంకరపట్నం మండలంలోని తాడికల్, ఏరడపల్లి, ముత్తారం, మొలంగూరు, గద్దపాక, కాచాపూర్ గ్రామాల్లో, అలాగే మానకొండూర్ మండలంలోని శేంషాబాద్, గంగిపల్లి, కొండపల్కల, మద్దికుంట, రంగపేట గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
కేంద్రాలు తెరిచినా కొనుగోళ్లు శూన్యం
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నా, ఇంతవరకు సేకరణ మొదలుపెట్టలేదని రామారావు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అకాల వర్షాల నేపథ్యంలో కనీసం తార్పాలిన్ షీట్లు, గన్నీ బ్యాగులు కూడా సరఫరా చేయడం లేదని, దీనివల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ జాప్యం వల్లే రైతులు గత్యంతరం లేక దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని, ఇది ప్రభుత్వ పెద్దలకు, ప్రైవేటు వ్యక్తులకు మధ్య కుదిరిన లోపాయికారీ ఒప్పందమని ఆయన ఆరోపించారు.
తరుగు పేరుతో నిలువు దోపిడీ
కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు ఐదు కిలోల ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తున్నారని, మిల్లుల వద్ద బస్తాకు మరో కిలో, రెండు కిలోలు తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. “హమాలీలు లేరని, మిల్లుల వారు తీసుకోవడం లేదని సాకులు చెబుతూ 60 శాతం ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తుల పాలు చేశారు. సన్న వడ్లకు ఇస్తామన్న రూ. 500 బోనస్ను ఎగొట్టేందుకే ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు వేస్తోంది” అని ఆయన విమర్శించారు. సాగు సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను ఇప్పుడు విడతల వారీగా ఇవ్వడం హాస్యాస్పదమన్నారు.
మే 30న కరీంనగర్లో ‘రైతు మహాగర్జన’
రైతుల సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని రామారావు హెచ్చరించారు. సన్న వడ్లకు క్వింటాల్కు రూ. 500 బోనస్ను ధాన్యం డబ్బులతో పాటే జమ చేయాలని, తరుగు లేకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పొద్దుతిరుగుడు, శనగ, మొక్కజొన్న రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వరి కోతలు పూర్తికాకపోవడం, విద్యార్థుల విన్నపం మేరకు కరీంనగర్లో నిర్వహించాల్సిన ‘రైతు మహాగర్జన’ సమరభేరి సభను మే 30వ తేదీకి మార్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ సభను రెండు లక్షల మంది రైతులతో రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ పర్యటనలో రైతు ప్రజా సంఘాల నాయకులు చింతిరెడ్డి మధుకర్ రెడ్డి, సామంతుల రాజయ్య, బాకారపు రాములు, శ్రీనివాస్ రెడ్డి, మేరుగు సంపత్ తదితరులు పాల్గొన్నారు.











