బాహు బలంన్యూస్ కరీంనగర్ ప్రతినిధి:
రాష్ట్రంలోని అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ మే 30వ తేదీన కరీంనగర్ వేదికగా ‘రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి’ సభను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు. శనివారం కరీంనగర్లోని హోటల్ శ్రీనివాస్లో నిర్వహించిన జాతీయ, రాష్ట్ర స్థాయి రైతు సంఘాల కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన ఈ సభను, క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వచ్చిన విన్నపాన్ని పురస్కరించుకుని వచ్చే నెల మే 30కి వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఇంకా పూర్తికాకపోవడం, ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యపు కొనుగోలు కేంద్రాలను కేవలం ఆర్భాటంగా ఏర్పాటు చేసి, ఆచరణలో మాత్రం కొనుగోళ్లు జరపకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడిసిపోతుంటే, కనీసం టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు సరఫరా చేయకపోవడం దారుణమన్నారు. ప్రైవేటు దళారులకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లలో జాప్యం చేస్తోందని, దీనివల్ల రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆరోపించారు. నాణ్యమైన ధాన్యానికి సైతం క్వింటాల్కు 6 కిలోల అదనపు తరుగు తీయడం దోపిడీకి పరాకాష్ట అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు ఇచ్చిన హామీలు ఏవీ?
ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని కేవలం 30 శాతం మందికే వర్తింపజేసి చేతులు దులుపుకుందని, మిగిలిన 70 శాతం మందికి వెంటనే మాఫీ చేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. పంటల సాగు సమయానికి రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను సైతం ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సన్న రకాలకే పరిమితం చేయడం సరికాదని హితవు పలికారు. రైతు బీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ. 6,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు.
కేవలం రైతులే కాకుండా, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, పాడి రైతులకు లీటరుకు రూ. 4 రాయితీని పునరుద్ధరించాలని రామారావు కోరారు. మే 30న నిర్వహించే మహాగర్జన సభ ద్వారా సుమారు రెండు లక్షల మందితో సర్కారుకు కనువిప్పు కలిగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి సండి తిరుపతి రెడ్డి, జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, రాష్ట్ర నేతలు బండ గోపాల్ రెడ్డి, చెన్నమనేని పురుషోత్తం రావు, చేకూరి అశోక్, రావుల కిరణ్ రెడ్డి, జున్నూతుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












