బాహు బలంన్యూస్ దిల్సుఖ్నగర్, ఏప్రిల్ 22:
రాష్ట్రంలోని పేద ఓసీల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వీడాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై పోలాడి రామారావు నిప్పులు:
సమావేశంలో రామారావు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఓసీల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా, కార్పొరేషన్లకు పాలక మండళ్లు నియమించకుండా, నిధులు కేటాయించకుండా కాలయాపన చేయడం ఓసీలను వంచించడమేనని మండిపడ్డారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఓసీలను వాడుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు, విద్యార్థి సమస్యలపై గళం:
ప్రభుత్వం ‘రైతు ప్రభుత్వం’ అని చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.
“రెండు లక్షల రుణమాఫీలో ఇంకా 70 శాతం మందికి ఎందుకు పూర్తి చేయలేదు?” అని ప్రశ్నించారు.
రైతు భరోసా నిధులను విడతల వారీగా కాకుండా పంట పెట్టుబడి సమయానికే ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు.
రామారావు పెట్టిన ప్రధాన డిమాండ్లు:
రెడ్డి మరియు ఇతర ఓసీ కార్పొరేషన్లకు తక్షణమే చట్టబద్ధత కల్పించి పాలక మండళ్లను నియమించాలి.
50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ. 6,000 పెన్షన్ అందించాలి.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి.
పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 చొప్పున రాయితీని పునరుద్ధరించాలి.
కరీంనగర్ సభను విజయవంతం చేయాలి:
ఈ నెల 28న కరీంనగర్లో నిర్వహించే ‘రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన – సమర భేరి’ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పోలాడి రామారావు పిలుపునిచ్చారు. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లు సాధించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జాతీయ చైర్మన్ నల్లా సంజీవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి, అమరవాది లక్ష్మీనారాయణ, నవల్గ సత్యనారాయణ రెడ్డి, నడిపెల్లి వెంకటేశ్వరరావు మరియు వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.












