బాహు బలంన్యూస్ కరీంనగర్ , ఏప్రిల్ 23: ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వీడాలని, తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి అన్నదాతలను ఆదుకోవాలని రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని చెర్లబూత్కూర్, ముగ్దూంపూర్, దుర్షేడ్, ఇరుకుళ్ల, చామనపల్లి గ్రామాల్లో ఆయన నాయకులతో కలిసి పర్యటించారు. ధాన్యపు కళ్ళాలను పరిశీలించి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారితో చర్చించారు.
ప్రచారానికే పరిమితమైన కొనుగోలు కేంద్రాలు
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటం కోసమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, క్షేత్రస్థాయిలో ఎక్కడా కొనుగోళ్లు జరగడం లేదని మండిపడ్డారు. అకాల వర్షాలు కురుస్తున్నా, ధాన్యం తడవకుండా కాపాడుకోవడానికి అవసరమైన టార్పాలిన్ షీట్లు కూడా అధికారులు సరఫరా చేయకపోవడం దారుణమన్నారు. మంత్రులు, అధికారులు సమన్వయ లోపంతో మొద్దునిద్రలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి డిమాండ్లు:
రైతు భరోసా: విడతల వారీగా కాకుండా, సాగు ప్రారంభంలోనే ఏకకాలంలో రైతు భరోసా నిధులు విడుదల చేయాలి.
బోనస్: అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ చెల్లించాలి; కేవలం సన్న రకాలకే పరిమితం చేయడం సరికాదు.
రైతు బీమా & పెన్షన్: రైతు బీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలి. 50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ. 6,000 పెన్షన్ అందించాలి.
పాల ఉత్పత్తిదారులు: గతంలో ఇచ్చిన విధంగా లీటరుకు రూ. 4 రాయితీని పునరుద్ధరించాలి.
విద్య & నిరుద్యోగం: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి. తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
ఓసీ కార్పొరేషన్: ఓసీ కార్పొరేషన్లకు పాలకమండళ్లను నియమించి, ప్రత్యేక నిధులు కేటాయించాలి.
28న సమర భేరి
రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 28న కరీంనగర్ జిల్లా కేంద్రంలో రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ‘రాష్ట్ర స్థాయి రైతుల మహా గర్జన – సమర భేరి’ సభకు రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలని రామారావు పిలుపునిచ్చారు.
ఈ పర్యటనలో చెర్లబూత్కూర్ మాజీ సర్పంచ్ కవ్వంపల్లి ఆంజనేయులు, రైతు ప్రజాసంఘాల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, నాయకులు దబ్బేట రమణారెడ్డి, సిహెచ్. శోభాదేవి, బల్మూరి సువర్ణ, పోల్సాని దేవేందర్ రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.













