బాహు బలంన్యూస్ హుస్నాబాద్, ఏప్రిల్ 19: రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, అన్నదాతల న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈనెల 28న కరీంనగర్ వేదికగా ‘రైతు మహాగర్జన’ సమర భేరి సభను నిర్వహిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు. ఆదివారం హుస్నాబాద్లో నిర్వహించిన ఓసీ ఐకాస, రైతు ప్రజాసంఘాల జిల్లా నాయకుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా సుమారు రెండు లక్షల మంది రైతులతో ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపును తగ్గించడంపై రామారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. “అన్ని రకాల పంటలకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సన్న రకాలకే పరిమితం చేయడం రైతుల్ని వంచించడమే” అని ఆయన విమర్శించారు. ఇప్పటికే రెండు విడతల రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం, ఇప్పుడు నామమాత్రంగా నిధులు విడుదల చేస్తూ రైతులను మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్లక్ష్యం వీడకపోతే ఉద్యమం తప్పదు
కేవలం రైతులకే కాకుండా విద్యార్థులకు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
సమర భేరి సన్నాహాలు
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఈ మహా గర్జన సభ కోసం నియోజకవర్గాల వారీగా బాధ్యులను నియమించినట్లు రామారావు తెలిపారు. ఓసీ జేఏసీ మరియు రైతు ప్రజాసంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, నాయకులు పన్యాల భూపతి రెడ్డి, అయిత నాగరాజు, అంచూరి సదానందం, ఆది రెడ్డి, భీమ్లా నాయక్, హంస కేతాన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, దేవేందర్ రావు తదితరులు పాల్గొని సభ విజయవంతానికి చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించారు.














