బాహు బలంన్యూస్ హుజూరాబాద్,ఏప్రిల్ 18:
హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం అంగన్వాడీ ప్రీ-స్కూల్ మేళా వేడుకగా జరిగింది. ‘పోషణ్ పఖ్వాడా’ కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేదికపై చిన్నారులు తమ ఆటపాటలతో అలరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న విద్య, ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆరోగ్యమే మహాభాగ్యం.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ రాంటాల సుహాసిని గారు చిన్నారులకు అంగన్వాడీ ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల ఎదుగుదలలో అంగన్వాడీల పాత్ర కీలకమని కొనియాడారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ ఫోన్లను అందజేశారు.
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం..
సిడిపిఓ (CDPO) సుగుణ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనతను నివారించి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ‘పోషణ్ పఖ్వాడా’ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే బాలామృతం, గుడ్లు, పాలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఈ సందడిలో అంగన్వాడీ సూపర్వైజర్ రమ్య, బ్లాక్ కోఆర్డినేటర్ నాగరాజు, మెప్మా ఆర్పీలు (RPs), అంగన్వాడీ టీచర్లు, పెద్ద సంఖ్యలో గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల తల్లులు పాల్గొన్నారు. చిన్నారి పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.












